బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రపంచమంతా ఉక్కు సంకల్పంతో ఉద్యమించాలని కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు…..
బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ప్రపంచమంతా ఉక్కు సంకల్పంతో ఉద్యమించాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. ఆదివారం తెల్లవారు జామున భారత్కు చేరుకున్న సత్యార్థికి సహచర భారతీయులు హృదయపూర్వక స్వాగతం పలికారు. ఓస్లో నుంచి ఆదివారం స్వదేశానికి తిరిగివచ్చిన ఆయన న్యూఢిల్లీలో విలేఖర్లతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విశృంఖల రూపం దాల్చిన బాల కార్మిక వ్యవస్థ చరిత్ర పుటల్లో సమాధి కావాలని కాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూల చట్టాన్ని ఇకనైనా ఆమోదించాలని లేదంటే పార్లమెంట్ సభ్యులను చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు. ఇటీవల ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంటున్నప్పుడు గాంధీజీ తనతో పాటే వచ్చి వేదికపై ఆశీనులైనట్లు అనిపించిందని సత్యార్థి తెలిపారు. . ప్రస్తుతం తన భావాలను వ్యక్తీకరించేందుకు మాటలు రావడం లేదని, ‘భారత్ మాతాకీ జై’ అంటూ సత్యార్థి ముగించారు.