నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా
నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా ఉంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు జిల్లా వ్యాప్తంగా రోడ్లకిరువైపులా షైన్ బోర్డ్స్, ఫ్లెక్సీ బ్యానర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యా సంస్థలు, ప్రధాన కూడళ్లలో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మీ-సేవ, ఆన్లైన్ ద్వారా డ్రైవింగ్ లెసైన్స్ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న రోడ్ల పనులకు ప్రాధాన్యతనిచ్చి 45 రోజుల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదేశించారు. పండుగలు, జాతరల సందర్భంగా ప్రైవేటు వాహనదారులు అధిక మొత్తంలో చార్జీలను వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని, వెంటనే తనిఖీలు నిర్వహించి అలాంటి వాహనాల పర్మిట్లను రద్దు చేయాలని డీటీసీ శివరాంప్రసాద్ను ఆదేశించారు. పంచలింగాల, శ్రీశైలం చెక్పోస్టులపై పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని, సంబంధిత అధికారులు బాధ్యతగా పని చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీటీసీ శివరాంప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలందిస్తున్నామని, రెవెన్యూ పరంగా రూ.136 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ.78.11 కోట్లు వసూలు చేశామని వివరించారు